ఆంధ్రప్రదేశ్ లో మే 6 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. తాజాగా ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా బుధవారం మధ్యాహ్నం విజయవాడలో విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి సంవత్సరంలో 2,41,599 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం 2,58,449 మంది ఉత్తీర్ణత కాగా.. 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఫస్ట్ ఇయర్ లో బాలురు 49 శాతం, బాలికలు 60 శాతం ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్ లో బాలురు 56 శాతం, బాలికలు 68 శాతం మంది పాస్ అయ్యారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉందని తెలిపారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం జూన్ 25వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.