దివ్యాంగ విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. వారి కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. ఆ వివరాలు..
దివ్యాంగ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వ గ్రాంటుతో నడుస్తున్న విద్యా సంస్థల్లో దివ్యాంగ విద్యార్థులకు ఐదు శాతానికి తగ్గకుండా సీట్లు కేటాయించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ విద్యాసంస్థల్లో ప్రవేశానికి వారికి ఐదేళ్ల సడలింపు కూడా ఇస్తూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం అంగవైకల్యం ఉన్న వారందరికీ ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. 44 శాతానికి తక్కువ కాకుండా అంగవైకల్యం ఉన్న వారికి విద్యాసంస్థల్లో ఐదు శాతం రిజర్వేషన్, ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తించనుంది. దివ్యాంగులకు ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
సుప్రీం కోర్టు సూచనల మేరకు దివ్యాంగుల కోసం విద్యాసంస్థల్లో ఐదు శాతం రిజర్వేషన్, ఐదేళ్ల సడలింపు వర్తించేలా ఏపీ ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చింది. దివ్యాంగుల హక్కులకు సంబంధించి ఏప్రిల్ 20న కొత్త నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ప్రస్తుతం ఈ ఆదేశాలతో ప్రతి ఏడాది ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు జరిపే సమయంలో దివ్యాంగులకు.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. వారికి కేటాయించిన 5శాతం రిజర్వేషన్ మేర సీట్లు కేటాయిస్తారు. వయో పరిమితి సడలింపు కూడా వర్తింపజేస్తారు. ఈ రిజర్వేషన్ కచ్చితంగా అయ్యేలా చూడాలని అన్ని శాఖల ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఆయా శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. మరి ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.