వారం రోజుల క్రితం కాకినాడ జిల్లాలో గ్రామ దేవత జాతరలో చోటు చేసుకున్న ఘర్షణలో రాము అనే యువకుడు మృతి చెందాడు. అతడి కుటుంబానికి జగన్ సర్కార్ అండగా నిలిచింది. ఆ వివరాలు...
వారం రోజుల క్రితం కాకినాడ జిల్లా శృంగవృక్షంలో గ్రామ దేవత జాతరలో రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో దళిత యువకుడి రాము తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ సర్కార్ రాము కుటుంబానికి అండగా నిలిలించి. మంత్రి రాజా, కలెక్టర్ కృతికా శుక్లాలు గురువారం తొండంగి వెళ్లి రాము కుటుంబాన్ని పరామర్శించారు. రాము కుటుంబానికి రెండెకరాల భూమి పట్టా, ఇంటి స్థలం, 10 లక్షల ఆర్థిక సాయం.. అలాగే మృతుని తల్లికి పింఛను, ఉద్యోగానికి సంబంధించిన పత్రాలను ఆమెకు అందజేశారు. అంతేకాక ఈ ఘటనలో గాయాలపాలైన శృంగవృక్షంకు చెందిన మరో ఏడుగురికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు మంత్రి రాజా. వీటితో పాటు ప్రభుత్వం నుంచి మరింత సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేస్తున్నామని.. నిందితులను వదిలే ప్రసక్తి లేదని మంత్రి రాజా స్పష్టం చేశారు.
మరోవైపు శృంగవృక్షం అమ్మవారి జాతరలో ప్రాణాలు కోల్పోయిన రాము కుటుంబానికి, క్షతగాత్రులకు అండగా ఉంటామని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. తొండంగి వెళ్లి.. మృతుడి కుటుంబాన్ని, శృంగవృక్షంలో క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 40 ఏళ్ల నుంచి సోదరభావంతో కలసిమెలిసి ఉండే తుని నియోజకవర్గంలో ఇలాంటి దాడులు జరగడం దురదృష్టకరమన్నారు యనమల. మృతుడు రాము కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు యనమల కృష్ణుడు. మరోవైపు శృంగవృక్షం వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు పిలుపు ఇవ్వగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రాము కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన 14 మంది ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులను రాజమండ్రిలోనే ముందస్తుగా అరెస్టు చేశారు పోలీసులు.
వారం రోజుల క్రితం ఇక కాకినాడ జిల్లా తొండంగి మండలం శృంగవృక్షంలో జరిగిన నూకాలమ్మ జాతర సందర్భంగా చిన్న వివాదం రేగింది. జాతర సందర్భంగా ఇద్దరి మధ్య రేగిన వివాదం కాస్త పెరిగి పెద్దదయ్యి.. ఇరువర్గాల వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో రాము అనే యువకుడు తీవ్రంగా గాయపడి చనిపోయాడు.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఇక ఈ ఘటనలో మృతి చెందిన రాముది తొండంగి కాగా.. జాతర ఉందని తమ అమ్మమ్మగారి ఇల్లు శృంగవృక్షం వచ్చాడు. రాము డిగ్రీ పూర్తి చేసి.. ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఈ క్రమంలో నిందితులపై హత్యాయత్నం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద 13 మందిపై కేసు నమోదు చేశారు. మరి జగన్ సర్కార్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.