అమరావతి- ఏపీలో సినిమా టికెట్ల ధరలపై కొంతకాలంగా వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకే ఏపీ ప్రభుత్వం ఓ స్టీరింగ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ గురువారం ఉదయం సచివాలయంలో భేటీ అయి, సినిమా టికెట్ల వివాదం, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించింది. ఈ వివాదానికి నేటితో చెక్ పడనుందని అందరూ భావిస్తున్నారు.
తాజాగా ఏపీలో థియేటర్స్ కి 100 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక సినిమాకు వచ్చే ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు నుండి 100 శాతం ఆక్యుపెన్సీ అమలు చేసుకోవచ్చు అని ప్రభుత్వం తెలిపింది.
ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామదాసు మీడియాతో మాట్లాడారు. టికెట్ల రేట్లపై అన్ని అంశాలను చర్చించామని, కమిటీ అడిగినవాటికి 99 శాతం ప్రభుత్వం అనుకూలంగా ఉందని తెలిపారు. సినిమా టికెట్ల ధరలు మూడు స్లాబుల్లో ఉండనున్నట్లు చెప్పారు. అతిత్వరలోనే దీనిపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని పేర్కొన్నారు.