ఏపీ ప్రభుత్వం ఈ నెలలో 1,23,519 మంది అర్హులకు రూ. 10 వేలు చొప్పున ఒక్కొక్కరి ఖాతాలో జమ చేయనుంది. మొత్తం 123.52 కోట్లు జమ చేయబోతోంది.
ఏపీ ప్రభుత్వం మరోసారి మత్స్యకారులకు శుభవార్త చెప్పింది. ఒక్కొక్కరి ఖాతాలో రూ. 10 వేలు జమ చేయనుంది. సముద్రంలో వేటపై నిషేధం ఉండడంతో ఏపీ ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం అందించనుంది. వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద అర్హులైన వారికి సాయం చేయనుంది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ 60 రోజుల పాటు సముద్రంలో వేటను నిషేధించింది ఏపీ ప్రభుత్వం. సముద్రంలో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యలను సంరక్షించాలన్న ఉద్దేశంతో వేట నిషేధ నిర్ణయం తీసుకుంది. అయితే వేట మీద ఆధారపడి జీవించే మత్స్యకారులకు ఈ 2 నెలల విరామం భారం కాకూడదన్న ఉద్దేశంతో భరోసా కింద ఆర్థిక సాయం అందజేస్తుంది.
వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద మత్స్యకారుల కుటుంబాలకు రూ. 10 వేలు ఆర్థిక సాయం చేయనున్నారు. ఇప్పటికే 1,23,519 మందిని అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. 1,23,519 మంది అర్హుల ఖాతాల్లో 123.52 కోట్లు జమ చేయనుంది. ఈ నెల 16న బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగే కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేయనున్నారు. గతంలో వేట నిషేధ భృతి రూ. 4 వేలు ఉంటే.. జగన్ ప్రభుత్వం రూ. 10 వేలకు పెంచింది. వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద రూ. 10 వేలు పొందాలంటే వయసు 21 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇక వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 1.20 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో అయితే రూ. 1.44 లక్షల లోపు ఉండాలి.
అయితే సంక్షేమ పథకాలు పొందిన వారు, మత్స్యకార పింఛను పొందుతున్న వారు, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ రంగ ఉద్యోగం చేస్తుంటే గనుక వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద రూ. 10 వేలు పొందడానికి అనర్హులుగా పరిగణించబడతారు. అలానే 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూమి.. రెండూ కలిపి 10 ఎకరాలకు మించి ఉన్నవారికి ఈ పథకం వర్తించదు. అర్బన్ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి ఇల్లు ఉన్నా, ఆదాయపన్ను చెల్లించే వారికి ఈ పథకం వర్తించదు. అలానే వేట విరామాన్ని ఉల్లఘించిన మత్స్యకారులకు సంక్షేమ పథకాలు రద్దు చేసి వారి పడవలను సీజ్ చేస్తారు.