వీఆర్వోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పండుగ పూట వీఆర్వోలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ క్రమంలో రాష్ట్రంలోని గ్రేడ్–1, 2 గ్రామ రెవెన్యూ అధికారులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సర్వీస్లో ఉన్న గ్రేడ్–1, 2 వీఆర్వో మరణిస్తే అతని కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకానికి అవకాశం కల్పిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ వీఆర్వో సర్వీస్ నిబంధనలు–2008 లో మార్పులు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ నిర్ణయంతో గ్రేడ్–1, 2 వీఆర్వో కుటుంబంలో డిగ్రీ విద్యార్హత కలిగిన భాగస్వామి/పిల్లలకు కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్, ఈ క్యాడర్కు సమానమైన ఉద్యోగాలు కల్పించే అవకాశం లభించనుంది. కారుణ్య నియామకాలపై వీఆర్వోలు ఏళ్ల తరబడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే గతంలో టీడీపీ ప్రభుత్వం వీఆర్వోల డిమాండ్ను పట్టించుకోలేదు. ఇప్పుడు జగన్ సర్కార్ దీన్ని పరిగణనలోకి తీసుకుని సుదీర్ఘ కాల డిమాండ్ను నెరవేర్చింది. ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాల నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపారు.