సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనావ్యాప్తి, కట్టడి చర్యలపై చర్చించిన మంత్రివర్గం.. ఒమిక్రాన్ కట్టడికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. పీఆర్సీ విషయంలో గతంలో విడుదల చేసిన జీవోలను ఆమోదించింది. కరోనా సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఆరోగ్య, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబంలోని సభ్యులకు కారుణ్య నియామకాలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
మంత్రివర్గం సమావేశం తర్వాత తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని వివరించారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ప్రభుత్వ పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. ‘కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలకు తెగించి ఫ్రంట్ లైన్ వర్కర్లు సేవలందించారు. అలా సేవలందిస్తూ కొందరు ప్రాణాలు కోల్పోయారు. అలా మరణించిన ప్రభుత్వ ఉద్యోగులైన ఫ్రంట్ లైన్ వర్కర్ల వారి కుటుంబంలోని సభ్యులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. జూన్ 30 కల్లా ఈ నియామకాలు అమలు జరిగేలా చూడాలన్నారు. వెసులుబాటు కోసం అర్హతను బట్టి గ్రామ, వార్డు సచివాలయాల్లోని ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల్లో నియమించేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తూ తీర్మానం చేయడం జరిగింది’ అని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.