అసలు రాజకీయ నాయకులు అంటే.. కేవలం ఎన్నికల వేళ మాత్రమే.. జనాల ముందుకు వస్తారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇక పత్తా ఉండరు. ఓట్ల వేళ.. ప్రజల వెంట తిరిగే నాయకులు.. ఆ తర్వాత పత్తా ఉండరు. మళ్లీ ఎన్నికల వేళ మాత్రమే వారికి ప్రజలు గుర్తుకు వస్తారు. అసలు ప్రభుత్వ తీసుకొచ్చిన పథకాలు ఏంటి.. అవి ప్రజలకు అందుతున్నాయా లేవా అనే విషయాలు నాయకులకు పట్టవు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం.. సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు తీసుకురావడమే కాక.. వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి.. ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు ప్రజలకు సరిగా అందుతున్నాయా లేదా తెలుసుకోవడం కోసం.. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చారు సీఎం జగన్. దీనిలో భాగంగా.. నాయకులు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి.. పథకాల అమలు తీరు ఎలా ఉంది స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ అద్భుత సన్నివేశం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఓ రైతు పాదాలకు మొక్కాడు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వం గురించి, సీఎం జగన్ గురించి ఓ రైతు మాట్లాడిన మాటలు విని.. సంతోషంతో.. ఆ రైతుకి పాదాలకు వందనం చేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం మొరవకండ్రిగలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.. డిప్యూటీ సీఎం చేసిన పని చూసి.. స్థానికులు ఆశ్చర్యపోయారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏపీ డిప్యూటీ నారాయణస్వామి చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో ఇంటింటికి తిరిగారు. ఈ క్రమంలో ఓ వృద్ధ దంపతుల దగ్గరకు వెళ్లారు నారాయణస్వామి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పక్కనే ఉన్న వైసీపీ కార్యకర్తలు.. డ్వాక్రా రుణమాఫీ జరిగిందా అని వృద్ధురాలని ప్రశ్నించారు. అందుకు ఆమె జరిగిందని సమాధానం ఇచ్చారు. అలాగే పింఛన్ వస్తుందా అని అడిగితే.. తన భర్తకు ఫించన్ వస్తుందని సమాధానం ఇచ్చింది. ఆ తర్వాత నేతలు.. మరి ఈ మంచి పనులు ఎవరు చేస్తున్నారని ఆ వృద్ధురాలిని ప్రశ్నించారు.
ఈ ప్రశ్న విన్న వెంటనే స్పందించిన వృద్ధురాలి భర్త.. జగన్ ఇవన్నీ చేస్తున్నారని సమాధానం చెప్పారు. మళ్లీ ఆయనే సీఎంగా రావాలి అన్నారు పెద్దాయన. ఆ మాట వినగానే.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. ఆ రైతుకు దగ్గరకు వెళ్లి.. అతడి పేరు అడిగి తెలుసుకున్నారు. అప్పుడు రైతు.. తన పేరు రాధానాయుడు అని చెప్పాడు. సీఎం జగన్ పాలన బాగుందని చెప్పారు.. మళ్లీ ఆయన అధికారంలోకి వస్తేనే రాష్ట్రం పచ్చగా ఉంటుందన్నాడు రాధానాయుడు.
అతడి మాటలు విన్న నారాయణ స్వామి.. ఓ డిప్యూటీ సీఎంగా ఉన్నా తాను.. పాదాభివందనం చేస్తున్నానంటూ.. ఆ రైతు పాదాలకు వందనం చేశారు. జగన్ సర్కార్ పాలనలో కులాలు, పార్టీలకతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు దక్కుతున్నాయన్నారు నారాణయ స్వామి. ఇక్కడే కాక.. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు జగనే మళ్లీ సీఎంగా రావాలని కోరుకుంటున్నారని తెలిపాడు.