గురువు అంటే.. జ్ఞానాన్ని బోధించేవాడు. మన సమాజంలో తల్లిదంద్రుల తర్వాత స్థానం గురువుకు కల్పించారు. అంతటి మహోన్నత స్థానాన్ని పొందిన వ్యక్తి.. ఎంత బాధ్యతగా ఉండాలి. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలి. ప్రేమను పంచుతూనే బాధ్యతగా కూడా ఉండాలి. కానీ నేటి కాలంలో కొందరు గురువులు అకృత్యాలకు పాల్పడుతున్నారు. విద్యార్థులను వేధిస్తున్నారు. మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి చిత్తూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. టీచర్ దెబ్బలకు తాళలేక ఓ విద్యార్థి కోమాలోకి వెళ్లాడు. ఆ వివరాలు..
చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మాసిస్ మిషనరీ స్కూల్ లో ఘోరం జరిగింది. బాధిత బాలుడి పేరు రోహిత్. 8వ తరగతి చదువుతున్నాడు. జ్వరంతో బాధపడుతూ స్కూల్ కి వెళ్లాడు. కాగా, లెక్కల మాస్టర్ జ్యోతీశ్వర్.. రోహిత్ పై చేయి చేసుకున్నాడు. రోహిత్ తలను బల్లకేసి కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత రెండు రోజులకు రోహిత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మాటలు రాక ఇబ్బందులు పడ్డాడు.
రోహిత్ పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే రోహిత్ ని తిరుపతికి తీసుకెళ్లారు. స్విమ్స్ ఆసుపత్రిలో రోహిత్ కు చిక్సిత్స అందిస్తున్నారు. కాగా, రోహిత్ ను కొట్టిన టీచర్ ను స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారుల విచారణ చేపట్టారు. టీచర్ కొట్టడంతో బాలుడు కోమాలోకి వెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.