సాధరణంగా పండుగలను దృష్టిలో పెట్టుకుని పలు రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రజలకు కానుకలను ఇస్తుంటాయి. అలాగే మరికొన్ని పథకాలను సైతం ప్రారంభించడం మనందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రజలకు వరాలు కురిపించాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పౌరసరఫరాల శాఖ 1.46 కోట్ల రేషన్ కార్డుదారులకు కందిపప్పు, పంచదారను రాయితీలపై అందించనుంది. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న 1.46 కోట్ల మందికి ఈ సంక్రాంతి కానుకగా కందిపప్పు, పంచదారలను రాయితీల రూపంలో పంపిణీ చెయ్యాలని తీర్మాణించింది. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డుదారులకు కిలో కందిపప్పు ను రూ. 67 రూపాయలకే అందించనుంది. కందిపప్పుతో పాటుగా అరకేజీ చక్కెరను రూ. 17 రూపాయలకు పౌరసరఫరాల శాఖ పంపిణీ చేయనుంది. దీనికోసం ఏకంగా 9,573 టన్నుల కందిపప్పుతో పాటుగా 6,769 టన్నుల చక్కెరను అందుబాటులో ఉంచినట్లు పౌరసరఫరాల శాఖ పేర్కొంది. దాంతో మధ్య తరగతి వర్గానికి ఇంది ఎంతో మేలు చేయనుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్రాంతి కానుగా పలు కార్యక్రమాలను తీసుకొచ్చిన విషయం తెలిందే.