ఆకర్షణనే ప్రేమగా భావించి జీవితాలను నాశనం చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. తెలిసి తెలియని వయసులో కలిగే ఆకర్షణనే ప్రేమగా భావించి.. చదువు వదిలేసి.. తల్లిదండ్రలును కాదని ఇంట్లో నుంచి వెళ్లిపోయి.. ఆ తర్వాత జీవతం నాశనం అయ్యాక.. ఇటు కన్నవారి దగ్గరకి రాలేక.. అటు జీవితాన్ని చక్కదిద్దుకునే అవకాశం లేక.. చీకట్లోనే వారి జీవితాలు తెల్లారుతాయి. కొన్ని సార్లు పిల్లలు చేసిన తప్పులను సరిదిద్దే అవకాశం లభించినా సరే.. పెద్దలే దగ్గరుండి మరి వారి జీవితాలను నాశనం చేస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 8వ తరగతి చదువుతున్న బాలికను ప్రేమ పేరుతో మోసం చేశాడో యువకుడు. బాలికకు మంచి మాటలు చెప్పి.. అతడి బారి నుంచి కాపాడాల్సిన పెద్దలు.. అందుకు భిన్నంగా బాలికకు వివాహం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాలు..
ఈ సంఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. ఉరవకొండ మండలం, ఆమిద్యాల గ్రామానికి చెందిన మైనర్ బాలికను.. ఓ యువకుడు ప్రేమ పేరుతో వంచించాడు. ప్రేమ పేరు చెప్పి.. తరచూ బాలిక ఇంటి దగ్గర తిరుగుతూ ఉండేవాడు. ఇది గమనించి బాలిక తల్లిదండ్రులు, గ్రామస్తులు.. ఈ నెల 18న పంచాయతీ పెట్టారు. బాలిక ఇంటి ముందే.. యువకుడి పసుపుతాడు కట్టించి.. ఇక మీకు పెళ్లయిపోయింది వెళ్లండి అని ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. అది కాస్త పోలీసుల దృష్టికి చేరింది.
దీనిపై ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి స్పందించారు. అధికారులను అమిద్యాల గ్రామానికి పంపి.. బాలికను విచారించారు. అనంతరం బాలికను చైల్డ్ హోంకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. బాల్య వివాహం చట్ట రీత్యా నేరమని.. కనుక బాలిక వివాహం చెల్లుబాటు కాదని తెలిపారు. అంతేకాక.. బాలికను కేజీబీవీ పాఠశాలలో ఉంచి మేజర్ అయ్యే వరకు చదివిస్తామన్నారు. ఇక పోలీసులు ఈ ఘటనపై స్పందిస్తూ.. బాలిక మెడలో తాళి కట్టిన యువకుడిని.. అందుకు ప్రొత్సాహించిన గ్రామ పెద్దలను పోలీస్ స్టేషన్కు పిలిపించినట్లు తెలుస్తోంది. మరి మైనర్ బాలికకు ఇఆ వివాహం చేయడం సరైన పనేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.