నంద్యాల జిల్లాలో పోలీసులు చేసిన పనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ మైనర్ బాలికను ఇద్దరు కానిస్టేబుల్స్ బైక్ పై పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లిన విధానం ప్రస్తుతం వివాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ పోలీసులు.. ఆత్మకూరు మండలం సిద్ధాపురం గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఓ కేసులో అనుమానితురాలిగా భావించిన ఆళ్లగడ్డ పోలీసులు.. ఆటోలో వెళ్తున్న బాలికను అడ్డగించి.. బైక్ పై ఇద్దరి మధ్య కూర్చోబెట్టి స్టేషన్ కి ఘటన వివాదాస్పదంగా మారింది.
ఇద్దరు మగ పోలీసులు బైక్పై బాలికను వారి మధ్యలో కూర్చొబెట్టి తీసుకెళ్లడం ఏంటని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ విషయంలో తమకు ఎటువంటి సమాచారం అందలేదని స్థానిక ఆత్మకూరు ఎస్సై హరిప్రసాద్ చెబుతుండటం గమనార్హం. ఇక ఆళ్లగడ్డ పోలీసులు ఆ మైనర్ బాలిక పట్ల వ్యవహరించిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు, నెటిజన్లు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. కానిస్టేబుల్స్ బాలికను బైక్ పై తీసుకెళ్లిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఆళ్లగడ్డ కానిస్టేబుల్స్ వ్యవహరించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.