ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు షాకిచ్చింది. సత్తెనపల్లి పోలీసులు.. కోర్టు ఆదేశాల మేరకు అంబటిపై కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబుపై ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యూలేషన్ స్కీమ్ నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సత్తెనపల్లి పోలీసులు తెలిపారు. మంత్రి అంబటి రాంబాబు పేరు మీద వైసీపీ నేతలు.. సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి లక్కీ డ్రా నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన గుంటూరు కోర్టు.. మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాక అంబటిపై విచారణ చేపట్టాలని సత్తెనపల్లి పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దాంతో పోలీసులు లక్కీ డ్రా వ్యవహారంలో మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు.
ఇక పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి అంబటి రాంబాబు సందడి చేశారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో.. ఏకంగా స్టెప్పులేసి అందరిలో జోష్ పెంచారు. స్థానిక బంజారా మహిళలతో కలిసి అంబటి రాంబాబు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే.