Oke Oka Jeevitham Telugu Movie Review: శర్వానంద్, రీతూ వర్మ జంటగా.. అమల అక్కినేని, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో.. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ “ఒకే ఒక జీవితం”. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కించబడింది. టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 9న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. కళ్యాణ్ రామ్ హీరోగా టైం ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన బింబిసార ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనం చూసాం. మరి అదే టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన ఒకే ఒక జీవితం సినిమా హిట్ అయ్యిందా? లేదా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఆది(శర్వానంద్), చైతన్య(వెన్నెల కిషోర్), శీను(ప్రియదర్శి) ముగ్గురూ బాల్య స్నేహితులు. ఒకరంటే ఒకరికి ప్రాణం. చిన్నప్పటి నుండి సమస్యలు ఎదుర్కుంటూ జీవితాన్ని ఏదో అలా నెట్టుకొస్తూ ఉంటారు. అలాంటి ఈ ముగ్గురు స్నేహితులకి పాల్(నాజర్) అనే శాస్త్రవేత్త పరిచయం అవుతాడు. టైం ట్రావెల్ పై ప్రయోగాలు చేసే ఆ శాస్త్రవేత్త ఆ ముగ్గురినీ టైం ట్రావెల్ లో బాల్యంలోకి పంపిస్తానని అంటాడు. బాల్యంలో చేసిన తప్పులని సరిదిద్దుకునే అవకాశం ఇస్తానని పాల్ అంటాడు. ముగ్గురూ తాము చేసిన మిస్టేక్స్ ని సరిదిద్దుకోవడానికి, తాము వదిలేసిన సమస్యలని సాల్వ్ చేయడానికి టైం మెషిన్ లో 1998 కాలానికి ట్రావెల్ చేసేందుకు అంగీకరిస్తారు. టైమ్ మెషిన్ లో తమ బాల్యంలోకి వెళ్లి తాము చేసిన తప్పులని సరిద్దుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంటుంది. బాల్యంలో ఉన్న ముగ్గురు పిల్లలు అదే టైం మెషిన్ ని ఉపయోగించి తమ తల్లిదండ్రులని వదిలేసి భవిష్యత్తులోకి వచ్చేస్తారు. ఆ ముగ్గురు స్నేహితులు ఏం చేస్తారు? ఆ రెండు గ్రూపులు తమ స్థానాలని ఎలా మార్చుకున్నాయి? వీటన్నిటికీ జవాబు కావాలంటే సినిమా చూడాల్సిందే.
టైం ట్రావెల్ మీద చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమా మాత్రం టైం ట్రావెల్ తో వచ్చిన మిగతా సినిమాల కంటే ఇది భిన్నంగా ఉంటుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ని దర్శకుడు శ్రీ కార్తీక్ చాలా బాగా రాసుకున్నారు. తల్లిదండ్రుల విషయంలో పిల్లలు తప్పులు చేయడం సహజం. ఆ తప్పులు పిల్లలు పెద్దయిన తర్వాత మాత్రమే తెలుస్తాయి. కానీ ఆ వయసులో సరిదిద్దుకునే అవకాశం రాదు. అలాంటి అవకాశం వస్తే బాగుణ్ణు అని జీవితంలో ఒక్కసారైనా అనుకునే వారి ఆలోచనకి సరితూగే సినిమా ఈ “ఒకే ఒక జీవితం”. తల్లిదండ్రుల విషయంలో పిల్లలు చేసే తప్పులని సరిదిద్దుకునే అవకాశం రావడం, టైం ట్రావెల్ ద్వారా బాల్యంలోకి వెళ్లి చేసిన తప్పులను సరిదిద్దుకోవడం, ఆ సమయంలో వారి మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఇవన్నీ దర్శకుడు బాగా రాసుకున్నారు. శర్వానంద్ కి చాలా కాలం తర్వాత మంచి హిట్ పడింది. ప్రతీ మనిషికి ఒకే ఒక జీవితం ఉంటుంది, ఆ జీవితాన్ని తప్పులతో కాకుండా సరైన దారిలో నడిపించుకోవాలి అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు.
నటనకు స్కోప్ ఉన్న కంటెంట్ దొరికితే శర్వానంద్ ఇరగ్గొట్టేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. గత సినిమాలే అందుకు ఉదాహరణ. తాజాగా ఈ సినిమాలో కూడా శర్వా తన నటనతో చింపేశారు. మరోసారి ఎమోషన్ తో కన్నీళ్లు పెట్టించారు. ఆది పాత్రకు శర్వా 100 పర్సెంట్ న్యాయం చేశారు. అక్కినేని అమల ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆమె ఉండడం వల్ల కథకి జీవం వచ్చింది. చాలా సహజంగా నటించారు. ఇక వెన్నెల కిషోర్, ప్రియదర్శిలు అయితే చాలా బాగా నటించారు. నిజ జీవితంలో శర్వాకి ప్రాణ స్నేహితులేమో అన్న భావనని కల్పించారు. నాజర్, రీతూ వర్మ తమ పాత్రల మేరకు ప్రాణం పోశారు. ఇతర నటీనటులు కూడా తమ పాత్ర పరిధిలో బాగా నటించారు.
ఇలాంటి ప్రయోగాత్మక కాన్సెప్ట్ ని తీసుకున్నందుకు డైరెక్టర్ శ్రీ కార్తీక్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఒక ఎమోషనల్ కాన్సెప్ట్ ని సైన్స్ ఫిక్షన్ జోనర్ కి జోడించి చూపించడం అనేది హర్షించతగ్గ విషయం. బింబిసారలో ఆల్రెడీ ఈ టైప్ జోనర్ ని చూసాం కానీ అది పక్కా కమర్షియల్ సినిమా. కానీ ఇది పక్కా ఎమోషనల్ సినిమా. రెండు సినిమాలకి చాలా వైవిద్యం ఉంది. దేని స్టఫ్ దానిదే. స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు దర్శకుడు శ్రీ కార్తీక్. ఇక తెలుగు వెర్షన్ కి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ చాలా బాగా రాశారు. ఎమోషనల్ డైలాగ్స్ గుండెకి హత్తుకుంటాయి. ఇక సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సన్నివేశాలన్నీ చాలా సహజంగా చూపించారు సుజిత్ సారంగ్. శ్రీజిత్ సారంగ్ ఎడిటింగ్ వర్క్, జేక్స్ బెజాయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయి. టైం ట్రావెల్ కి సంబంధించిన సీన్స్ లో విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ విలువలు గ్రాండ్ గా ఉన్నాయి. సినిమా చూస్తున్నట్టు ఉండదు. ఎవరికి వారు తమ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నట్టు అనిపిస్తుంది.
గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!