
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణ పేరు తెలియని వారు ఉండరు. ఫైర్బ్రాండ్, జేజమ్మ అని అక్కడి ప్రజలు ఆమెను పిలుస్తుంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు డీకే అరుణ అంటే ఓ బ్రాండ్ ఉండేది. ఆమె మాటల తూటాలకు ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఈ కారణంగానే ఆమెకు వైయస్ఆర్ మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే ఇదంతా ఒకప్పుటి మాట. 2019 ఎన్నికల తరువాత ఆమె హస్తం గుర్తుకు చేయిచ్చి బీజేపీలో చేరింది.
అయితే అది ఆమెకు ఏమాత్రం కలిసిరాలేదు. బీజేపీలో అప్పటికే సీనియర్ నాయకులు ఉండటం, బీజేపీలో యువతకు పెద్దపీట వేయడంతో డీకే అరుణ ఆ పార్టీలో నామమాత్రంగా మిగిలిపోయారు. దీంతో ఇప్పుడు ఆమె మరోసారి పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ భవిష్యత్ లీడర్ రేవంత్ రెడ్డి ఆమెను తిరిగి కాంగ్రెస్లో జాయిన్ కావాలంటూ కోరుతున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. తన సామాజిక వర్గానికి చెందిన లీడర్ కావడంతో పాటు, ఆమె కాంగ్రెస్లోకి వస్తే గద్వాల్ డివిజన్లో మళ్లీ కాంగ్రెస్ హవా కొనసాగుతుందని ఆయన భావిస్తున్నాడట.
అటు డీకే అరుణ కుటుంబ సభ్యులు, గద్వాల్ డివిజన్లోని అరుణ అభిమానులు, ఆమె కార్యకర్తలు కూడా ఆమె కాంగ్రెస్లోకి వెళ్లాలని సూచిస్తుండటంతో ఆమె ఆలోచనలో పడిందట. త్వరలోనే డీకే అరుణ కాంగ్రెస్ గూటిలో చేరుతుందనే వాదన గద్వాల్తో పాటు కాంగ్రెస్ వర్గాల్లోనూ జోరుగా వినిపిస్తోంది.