జనసేన అధినేత “పవన్ కళ్యాణ్” మంగళగిరి నియోజకవర్గం అభ్యర్థి స్థానాన్ని చివరి నిమిషంలో మార్చడంతో మంగళగిరి స్థానం రసవత్తరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు “నారా లోకేశ్” ఈ నియోజకవర్గం నుండే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.. లోకేశ్ పోటీ చేస్తుండడంతో మంగళగిరి హాట్ షీటుగా మారింది. దాంతో ఈ నియోజకవర్గం నుండి జనసేన కూడా రంగంలోకి దిగింది. ఇదిలాఉంటే నామినేషన్ల దాఖలుకు చివరి రోజున ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు పవన్ కళ్యాణ్.
జనసేన వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తుల్లో భాగంగా ఏడు అసెంబ్లీతో పాటు, రెండు పార్లమెంట్ స్థానాలను CPIకి కేటాయించింది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చడంపై CPI నేతలు అసంతృప్తికి గురయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపి సర్దుబాటు చేసుకున్నారు. ఇక అదే పొత్తుల్లో భాగంగా ముందుగా మంగళగిరి స్థానంలో CPI పార్టీ అభ్యర్థిని ప్రకటించింది జనసేన.
కానీ చివరి నిమిషంలో ఆ స్థానంలో కూడా మార్పులు చేసి జనసేన అభ్యర్థి “చల్లపల్లి శ్రీనివాస్”కు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. CPI తరఫున “ముప్పాళ్ల నాగేశ్వరరావు” నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతుండగా.. మంగళగిరి అభ్యర్థిగా “చల్లపల్లి శ్రీనివాస్” ను జనసేన ప్రకటించింది. బీ-ఫారాన్ని ఆదివారం అర్ధరాత్రి అందజేసింది. దీంతో శ్రీనివాస్ ఈరోజు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మార్పుకు గల కారణాలు ఏంటి ? అని ఆరా తీయగా.. స్థానికంగా ఉన్న జనసేన నేతలను సంతృప్తి పరిచేందుకు, అలాగే స్థానికంగా ఉన్న పార్టీ కేడర్ ను కాపాడుకునేందుకే జనసేన అధ్యక్షుడు పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ నిర్ణయం పట్ల CPI పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.