Maharashtra New CM Eknath Shinde Biodata In Telugu: గత కొన్నిరోజులుగా అనూహ్య మలుపులు తిరుగుతోన్న మహారాష్ట్ర రాజకీయం చివరి రోజు కూడా సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించింది. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో .. రెబల్స్ అండతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా వ్యూహం మార్చిన కమలనాథులు.. సీఎం కుర్చీని ఏక్ నాథ్ షిండేకే అప్పగించారు. ఈ ట్విస్ట్తో రాజకీయ వర్గాల భ్రమలు తొలగిపోయాయి. అయితే ఇప్పుడు మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా ఏక్ నాథ్ షిండే పేరు మారుమోగుతోంది. శివసేనలో తిరుగుబాటు నేతలకు సారథ్యం వహించి.. ఉద్ధవ్ సర్కార్ను కూల్చేసిన ఆయన ఎట్టకేలకు తన సీఎం కలను నెరవేర్చుకున్నారు. మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జనాలు.. అసలు ఎవరీ ఏక్ నాథ్ షిండే.. ఆయన ప్రస్థానం ఏంటి అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ప్రస్థానం... 1964 ఫిబ్రవరి 9న సాతారా జిల్లాలోని జవాలీ తాలూకాలో ఏక్నాథ్ షిండే జన్మించారు. నిరుపేదలైన షిండే కుటుంబం పొట్టకూటి కోసం థానేకు వలస వెళ్లింది. థానేలో ఆటో డ్రైవర్ నుంచి ఆయన జీవితం ప్రారంభమైంది. యశ్వంతరావు వాన్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. 1980లో శివసేన కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అప్పట్లో రిక్షా తొక్కుతూ, ఆటో నడుపుతూ జీవనం సాగించేవారు షిండే. 1984లో పార్టీ కిసాన్ నగర్ బ్రాంచ్ హెడ్ గా ఆయన నియమితులయ్యారు. 1997లో థానే మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 2004లో థానే నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. 2005లో థానే జిల్లాకు శివసేన అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు. ఇది కూడా చదవండి: Video: వామ్మో.. మెరుపు వేగంతో టికెట్లు ఇస్తున్న రైల్వే ఉద్యోగి..! వీడియో వైరల్ ఆ తరువాత 2009, 2014, 2019లో వరుసగా నాలుగుసార్లు అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2005లో థానే జిల్లా శివసేన అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2014లో ప్రతిపక్ష నేతగా, శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా పనిచేశారు. 2019 నవంబర్ 28 నుంచి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ఆధ్వర్యంలో పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. శివసేనపై అసంతృప్తితో ఇటీవల తిరుగుబాటు చేయడంతో జూన్ 21న శివసేన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. అయినప్పటికీ 40 మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉండగా.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇది కూడా చదవండి: Video: గోల్డ్ చైన్ ఎత్తుకెళ్తున్న చీమలు..! వీడియో వైరల్ కాగా బుధవారం సుప్రీంకోర్టు బలపరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్ధవ్ ఠాక్రే అకస్మాత్తుగా సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఉద్ధవ్ రాజీనామా నేపథ్యంలో నేడు జరగాల్సిన బలపరీక్షను అసెంబ్లీ సెక్రటరీ రద్దు చేశారు. రాష్ట్రంలో సర్కార్ పడిపోవడంతో అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ మద్దతుతో ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో కొత్త సర్కార్ కొలువుదీరనుంది. షిండే జీవితంలో విషాదం.. ఏక్ నాథ్ షిండే జీవితంలో 2000వ సంవత్సరంలో అత్యంత ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆయన ఇద్దరు కుమారులు దీపేష్ (11), శుభద (7)లు మహారాష్ట్రలోని వారి స్వగ్రామంలోని సరస్సులో బోటింగ్కు వెళ్లారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ పడవ బోల్తా పడి పిల్లలిద్దరూ నీటిలో మునిగి చనిపోయారు. ఈ దుర్ఘటనతో షిండే కొన్ని నెలల పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆనంద్ డిఘే, షిండేకు అండగా నిలిచారు. మనసు అటువైపు వెళ్లకుండా షిండేకు మరో కీలక బాధ్యత అప్పగించారు. షిండే సంతానంలో డాక్టర్ శ్రీకాంత్ షిండే ఒక్కరే జీవించి వున్నారు. ఆయన ఆర్ధోపెడిక్ సర్జన్ గా పనిచేస్తున్నారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన శ్రీకాంత్.. కళ్యాణ్ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన 2019లో మరోసారి విజయం సాధించారు. ఆటో డ్రైవర్ నుంచి సీఎంగా ఎదిగిన షిండే ప్రస్థానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Kerala: కొంతమంది వస్తే చరిత్రే మారిపోతుంది.. నేనూ ఆ కోవకే చెందుతా!