2030 నాటికి దేశంలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. దేశంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా మేనిఫెస్టోను రూపొందించామని.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో మాట్లాడారు రాహుల్ గాంధీ. సరికొత్త పద్దతిలో కాంగ్రెస్ పార్టీ విజన్ ను ఆవిష్కరించామని చెప్పారు. ఈ మేనిఫెస్టోను గదిలో కూర్చుని రూపొందించలేదని.. ప్రజల మనసులో ఆలోచన ప్రతిబింబించేలా రూపకల్పన చేశామని చెప్పారు. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, రణ్దీప్ సుర్జేవాలా తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోను ఒక్కసారి పరిశీలిస్తే..
* కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రనికి ప్రత్యేక హోదా
* మరీ ముఖ్యంగా అధికారంలోకి రాగానే రఫేల్ ఒప్పందం మీద విచారణ
* బ్యాంకుల్లో రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిపై వెంటనే సమగ్ర విచారణ
* న్యాయ్ పథకం ద్వారా ఏడాదికి రూ.72 వేలు చొప్పున పేదలకు అందిస్తాం. ఈ పథకం రెండు రకాలుగా పనిచేస్తుంది. మొదటగా ఇది పేదల జేబుల్లో డబ్బులు నింపుతుంది. రెండోది నోట్ల రద్దుతో దెబ్బతిన్న దేశ ఆర్థికపరిస్థితిని మెరుగుపరుస్తుంది.
* రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ను తీసుకొస్తాం. రుణాలు చెల్లించలేని రైతులపై పెట్టే కేసులను క్రిమినల్ కేసులుగా పరిగణించబోమ్.
* ప్రస్తుతం ఖాళీ ఉన్న 22 లక్షల పోస్టులను భర్తీ చేస్తాం. అలాగే పంచాయతీల్లో 10 లక్షల ఉద్యోగాలను పూరిస్తాం. కొత్తగా వ్యాపారం చేసుకునేవారికి తొలి 3 ఏళ్ల పాటు ఎలాంటి అనుమతులూ అవసరం లేకుండా చేస్తాం. మరీ ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీని పటిష్ఠం చేస్తాం. ఇప్పుడున్న 100 పని దినాలను 150కి పెంచుతాం.
* జాతీయ, అంతర్గత భద్రతకు పెద్దపీట వేస్తాం.
* అత్యంత ముఖ్యమైన మరో హామీ ఏంటంటే.. “విద్యపై జీడీపీలో 6 శాతం ఖర్చు చేస్తాం..” అంటూ పేదలను దృష్టిలో పెట్టుకొని తమ మేనిఫెస్టోను విడుదల చేసింది కాంగ్రెస్.