సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. దీంతో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..? ఏ పార్టీ ఎన్ని సీట్లను సాధించే అవకాశం ఉంది .? అంశాలను ముందుగానే బేరీజు వేసుకున్న పలువురు సీనియర్ రాకీయ నాయకులు, సినీ ప్రముఖులు వారి వారి మదిలోని పార్టీకి జై కొట్టి ఆ పార్టీ అధినేత సమక్షంలో జెండాను కప్పుకుంటున్నారు. అదే అంశానికొస్తే, ఇటీవల కాలంలో టీడీపీ నుంచి వీడిన వారి సంఖ్య, వైసీపీలో చేరిన వారి సంఖ్య ఎక్కువనే చెప్పాలి. అంతేకాక, తాజా రాజకీయ పరిస్థితులు వైసీపీ శ్రేణుల్లో మరింత జోష్ నింపిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, వైసీపీ శ్రేణుల్లో వెయ్యి టన్నుల మేర జోష్ నింపే మరొక వార్త వచ్చేసింది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మాజీ ఎంపీ గంగుల ప్రతాప్రెడ్డి కొద్దిసేపటి క్రితం టీడీపీకి రాజీనామా చేశారు. ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గంగుల బిజేంద్రారెడ్డికి ఆయన తన సంపూర్ణ మద్దతును ప్రకటించి, వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బిజేంద్రారెడ్డిని ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా, వైఎస్ జగన్ను ఏపీ ముఖ్యమంత్రిని చేయడమే తన లక్ష్యమని ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు.దీంతో ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి బరిలో ఉన్న భూమా అఖిల ప్రియకు బిగ్ షాక్ తగిలినట్లయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
నంద్యాల ఉప ఎన్నిక సమయంలో నారా చంద్రబాబు నాయుడు కోరిక మేరకే టీడీపీకి మద్దతు ఇవ్వడం జరిగిందని, ఆ ఎన్నిక సమయంలో తనకు ప్రజాబలం ఉందని గ్రహించిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఎంపీ టికెట్ తనకే ఇస్తానని మామీ ఇచ్చి నేడు ఆ మాటను నిలబెట్టుకోలేదని గుంగుల ప్రతాప్రెడ్డి తెలిపారు. దాంతో, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి బిజేంద్రారెడ్డి గెలుపే లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్టు తెలిపారు.