రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి.. వెన్నుదన్నుగా నిలవాలి అని ఎంతో ప్రతిష్టాత్మకంగా సీఎం కేసీఆర్ రైతు బంధును ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రైతు బంధు విషయంలో పలు అనుమానాలు, అపోహలు వినిపిస్తున్నాయి. అయితే వాటిపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రైతు బంధు విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు.
‘జనవరి 1 నుంచి వరుసగా నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు రావడంతో రైతు బంధు జమ ఆలస్యమైంది. కొందరు కావాలనే రైతు బంధు విషయంలో లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 60,16,697 మంది రైతుల ఖాతాల్లో రూ.6008.27 కోట్లు జమ చేశాం. 7 ఎకరాలున్న రైతుల ఖాతాల్లో నగదు జమ జరిగింది. అర్హులైన అందరికీ రైతు బంధు అందుతుంది. కేవలం ఒకటి, రెండు రోజుల్లోనే నగదు జమ జరుగుతుంది. ఎవరూ పుకార్లను నమ్మకండి. అర్హులైన అందరికీ రైతు బంధు కచ్చితంగా అందుతుంది’ అంటూ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు.