కరోనా కారణంగా విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు అనివార్యం అయ్యాయి. వాటి కోసం ఫోన్ల వాడకం పెరిగి చదువుతో పాటు వాటిలో గేమ్స్ ఆడటం అలవాటుగా మారింది. కొంతమంది విద్యార్థులకు అది వ్యసనంగా కూడా మారిపోయింది. మితిమీరిన అలవాటును అదుపుచేసేందుకు తల్లిదండ్రులు మందలిస్తుంటే పిల్లలు ఊహించని విధంగా షాక్ ఇస్తున్నారు. కన్నవారిని కన్నీళ్లు మిగిలిస్తున్నారు. అలాంటి ఓ ఘటనే నగరంలో చోటు చేసుకుంది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వోదయ నగర్లో తండ్రి మందలించాడని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటన సోమవారం ఉదయం చోటు చేసుకుంది. బాలిక తరుచూ మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉండేది. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి వరకు మొబైల్ ఫోన్తో విద్యార్థిని గేమ్స్ ఆడుతుండగా పడుకోమని తండ్రి మందలించాడు. దీంతో ఆ బాలిక తీవ్ర మనస్థాపానికి గురైంది. అందరూ పడుకున్న తర్వాత ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని ఉస్మానియ ఆసుపత్రికి తరలించారు. కూతురు మరణంతో బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇదీ చదవండి: ఆన్లైన్ క్లాస్ కోసం ఫోనిస్తే.. చాటింగులతో పెడదారి.. మందలించరాని అంత ఘోరమా…