మాజీ మంత్రి, బీజేపీ నేత గాలి జనార్ధన్ రెడ్డి... రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఈ పేరు గురించి తెలియని వారు దాదాపు ఉండకపోవచ్చు. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా పెను ప్రకంపనలు, వివాదాలకు కేంద్రబిందువైన పేరు ఇది. చాలాకాలం తరువాత మరోసారి వార్తల్లోకి ఎక్కారు గాలి జనార్ధన్ రెడ్డి. తనకు ఎమ్మెల్యే, మంత్రి కావాలని ఆశ లేదు.. తను అనుకుంటే ఒక్క రోజైనా సీఎం కాగలను అంటూ గాలి జనార్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాలి జనార్ధన్ రెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్ రెడ్డి 57వ బర్త్ డే వేడుక మంగళవారం రాత్రి బళ్లారిలోని క్లాసిక్ ఫంక్షన్ హాలో జరిగింది. ఈ కార్యక్రమానికి గాలి జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి జనార్ధన్ మాట్లాడారు. గాలి సోమశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. "రెడ్డి బ్రదర్స్కు, శ్రీరాములకు డబ్బుపై ఆశ లేదు. నాకు ఎమ్మెల్యే, మంత్రి కావాలని ఆశ లేదు.. నేను మనసు పెడితే ఒక్క రోజైనా సీఎం కాగలను. అయితే నాకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ కూడా లేదు. నాకు ఇబ్బందులు సృష్టించాలని కొందరు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని సీబీఐ అధికారులు స్వయంగా నాతో తెలిపారు" అని తెలిపారు. కాగా ఈ వ్యాఖ్యలు చేసిన మరుక్షణమే కార్యకర్తలు ఆయనపై పూలవాన కురిపించారు. ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్ధన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం అందరికి తెలిసిందే. గాలి జనార్ధన్ రెడ్డి కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్య నేతల్లో ఒకరు. కర్ణాటకలో అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులల్లో ఒకరు. బళ్లారి జిల్లా బీజెపీ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2006 లో శాసన మండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. మాజీ సీఎం యడ్యూరప్ప మంత్రివర్గంలో పర్యాటకం కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. బళ్లారి, ఓబుళాపురం అక్రమ మైనింగ్ కుంభకోణంలో జైలుకు వెళ్లి తిరిగి వచ్చాడు. తాజాగా గాలి జనార్ధన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స రూపంలో తెలిజేయండి.