ఫిల్మ్ డెస్క్- సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, గాయకుడు మాణిక్య వినాయగం(73) ఇక లేరు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాణిక్య వినాయగం ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
మాణిక్య వినాయగం తమిళనాడులోని మైలాడుతురైలో 1943 డిసెంబరు 10న జన్మించారు. ఆయన మేనమామ, ప్రమఖ సింగర్ ఎస్ జయరామన్ వద్ద సంగీత విద్యనభ్యసించి 2001 సంవత్సరంలో సినీ రంగంలోకి ప్రవేశించారు. మాణిక్య వినాయగం తమిళ చిత్రం దిల్ తో గాయకుడిగా కెరీర్ ప్రారంభించారు.
తన కెరీర్ మొత్తంలో అన్ని భాషల్లో కలిపి 800లకు పైగా పాటలు పాడారు మాణిక్య వినాయగం. దక్షిణాది భాషలన్నింటిలో తన గాత్రాన్ని వినిపించి ప్రేక్షకులను మెప్పించారు. మాణిక్య వినాయగం కేవలం సినిమా పాటలు మాత్రమే కాకుండా జానపద, ఆధ్యాత్మిక పాటలను కూడా పాడారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలోని.. పట్టుపట్టు చేయ్యే పట్టు పాటను పాడింది మాణిక్య వినాయగమే. కేవలం గాయకుడిగానే కాకుండా పలు సినిమాల్లో నటించి, నటుడిగానూ తనదైన ముద్రవేశారు. మాణిక్య వినాయగం మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.