Muzzafarnagar(UP): ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిందని సంతోషించాలో.. లేక సోషల్ మీడియా వచ్చాకే అమ్మాయిలపై ఆగడాలు ఎక్కువైపోయాయని బాధపడాలో తోచని స్థితిలో ఇప్పుడు సమాజం ఉంది. కేవలం ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదని ఓ యువకుడు 16 ఏళ్ళ బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. ఆ దుర్మార్గుడి దారుణానికి ఆ బాలిక నిండు ప్రాణం బలైపోయింది. అడ్డొచిందని తల్లిపై కూడా దాడి చేశాడు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లా.. నాగ్లా బోహార్ గ్రామంలో జరిగిన సంఘటనలో, ఫేస్బుక్లో తన ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించలేదని రవి అనే యువకుడు.. 16 ఏళ్ల బాలికను చంపి ఆపై ఆమె తల్లిని తీవ్రంగా గాయపరిచాడు. ఆ తర్వాత, ఆ యువకుడు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించి.. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు.
హత్యకు గురైన బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు అతడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ మార్తాండ్ ప్రకాష్ సింగ్ తెలిపారు. బాధితురాలి తండ్రి తేజ్వీర్ సింగ్.. ఫరీదాబాద్(హర్యానా)లోని ఓ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ సిబ్బందిగా పనిచేస్తున్నాడు. ఫేస్బుక్లో తన ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించకపోవడంతో రవి తన కూతురిని హత్య చేశాడని తేజ్వీర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం సాయంత్రం తేజ్వీర్ సింగ్ పనిలో ఉండగా.. పెళ్లి పత్రికను ఇచ్చేందుకు వచ్చాడు నిందితుడు రవి. ఆ కార్డు తీసుకునేందుకు బాలిక బయటికి వచ్చి తీసుకోబోయింది. వెంటనే కార్డులో దాచిన కత్తిని బయటికి తీసి, బాలికని అనేకసార్లు పొడిచి హత్యచేశాడు రవి. అప్పుడే బాలిక అరుపులు విన్న ఆమె తల్లి సునీత వచ్చి చూసేసరికి, రవి ఆమెపై కూడా కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన సునీత ప్రస్తుతం స్థానిక సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.