ఏపీ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. టీడీపీ నుంచి గెలిచిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు..అంతేకాదు, ఆ పార్టీ నేతలపై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది. దీంతో ఆయనను పంజాబ్ మొహాలీలోని ఓ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. భయపడాల్సిన అవసరం ఏమీ లేదని డాక్టర్లు తెలిపారు. ఈ విషయం మీడియాకు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే..
గత సంవత్సరం వల్లభనేని వంశి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)లో సీటు సాధించిన విషయం తెలిసిందే. సోమవారం పంజాబ్ లోని మొహాలీలో క్యాంపస్ లోని తరగతులకు ఆయన వెళ్తున్నారు. ఇప్పుడు అక్కడ థర్డ్ సెమిస్టర్ తరగతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో క్లాసులకు హాజరయ్యేందుకు వెళ్లిన ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఎడమ చేయి విపరీతంగా లాగడంతో వెంటనే ఆస్పత్రిలో చేరారు.
ఆయనకు పలు పరీక్షలు నిర్వహించిన తర్వాత వైద్యులు రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. టీడీపీ నుంచి గెలిచిన వంశీ.. ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. సీఎం జగన్ను పలుమార్లు కలిసిన ఆయన.. వైసీపీ కి సన్నిహితంగా ఉంటున్నారు.