'బాహుబలి సిరీస్'తో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఆ తర్వాత సాహో చిత్రంతో తన పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుండటం విశేషం. తన స్టార్డమ్ కి తగ్గట్టుగానే వరుసగా భారీ చిత్రాలను లైనప్ చేసాడు. ఓవైపు ఇండియాలో మాత్రమే కాకుండా డార్లింగ్.. చైనా, జపాన్, థాయ్ ల్యాండ్ లాంటి విదేశాలలో కూడా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు ప్రభాస్ సినిమాల కోసం విదేశీ ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు. ఇదివరకు రజనీకాంత్, ఆమీర్ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్.. లాంటి సూపర్ స్టార్స్ మాత్రమే ఆయా దేశాల్లో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో డార్లింగ్ ప్రభాస్ కూడా చేరడం విశేషం. తాజాగా ప్రభాస్ మరో ఘనత అందుకున్నాడు. యూకేకు చెందిన ప్రముఖ ‘ఈస్టర్న్ ఐ వీక్లీ 2021’ వెబ్సైట్ విడుదల చేసిన టాప్- 50 సౌత్ ఏషియన్ సెలబ్రిటీస్ జాబితాలో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచినట్లు సమాచారం. రెండవ స్థానాన్ని‘కేజీఎఫ్’ హీరో యశ్ కైవసం చేసుకున్నట్లు తెలుస్తుంది. ‘సాహో’ తర్వాత కరోనా కారణంగా ప్రభాస్ నుండి మరే చిత్రం రాలేదు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ మూవీ ఎట్టకేలకు సంక్రాంతి బరిలో విడుదలకు రెడీ అవుతోంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మిస్టీరియస్ లవ్ స్టోరీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇదేగాక ప్రభాస్ నుండి సలార్.. ఆదిపురుష్.. ప్రాజెక్ట్ కే.. లాంటి భారీ పాన్ ఇండియన్ చిత్రాలు రాబోతున్నాయి.