దేశ ప్రజలు ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్లడం జరుగుతూ ఉంటుంది. అయితే, వీళ్లు ఎక్కడకి వెళ్లితే అక్కడ.. దేశంలో ఏ రేషన్ దుకాణం నుంచైనా సరకులు తీసుకునే వీలుంటే ఎలా ఉంటుంది? అందుకే కేంద్రప్రభుత్వం ఒక సరికొత్త విధానాన్ని అవలంభించేందుకు రెడీ అవుతోంది. ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు..’ లక్ష్యం దిశగా చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్విలాస్ పాసవాన్ ప్రకటించారు.
దేశమంతా పనిచేసేలా రేషన్ కార్డుల విధానం అమలు దిశగా ముందుకెళ్లేందుకు నిర్ణయించారు. ఈ విధానం కార్డుదారులందరికీ.. ప్రత్యేకించి ఉపాధిని వెతుక్కుంటూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లేవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. కాగా, సమీకృత ప్రజా పంపిణీ విధానానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే రూపకల్పన చేశాయి. దీనిద్వారా ఆయా రాష్ట్రాల్లో వినియోగదారులు ఏ జిల్లాలోనైనా రేషన్ సరకులు తీసుకునేందుకు వీలు కలుగుతుంది. మరికొన్ని రాష్ట్రాలు కూడా దీనికి హామీ ఇచ్చాయి.