స్వాతంత్యం వచ్చి 70ఏళ్లైనా మౌలిక వసతుల కల్పనలో విఫలమయ్యారని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాగా, ఇటీవల మీడియా ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన ఐదేళ్లలోనే రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని చెప్పుకొచ్చారు. దేశంలో, రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే టీఆర్ఎస్ అభ్యర్దులను గెలిపించాలని కోరారామె. మనం 16 మందిని గెలిపిస్తే వాటిని 116 చేసే చతురత సీఎం కేసీఆర్కు ఉందన్నారు.
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రతిపాదన గురించి కవిత మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలతో కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి రాలేవన్నారు. తెలంగాణలోని 16 మంది ఎంపీలే రేపు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడటానికి కీలకం అవుతారన్నారు. ఇతర పార్టీలను కూడగట్టి వాటిని 116 చేసే సత్తా కేసీఆర్ కు ఉందన్నారు.
70 ఏళ్లైనా దేశంలో పేదరికం పోలేదని, దీనికంతటికీ ముఖ్య కారణం బీజేపీ, కాంగ్రెస్సేనన్నారు. దేశ రాజకీయాల్లో తెలంగాణ కీలక పాత్ర పోషించబోతుందని, అందుకు మీరు కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధులను గెలిపించాలని కవిత కోరారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్న కవిత.. అది సాకారం కావాలంటే ప్రజల ఆశిస్సులు టీఆర్ఎస్ అభ్యర్దులకు ఉండాలని విన్నవించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల నిరంతర విద్యుత్ రైతులకు అందిస్తున్నఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ మాత్రమేనన్నారు. నిరుద్యోగులకు జీవనభృతి మే ఒకటి నుంచి అందిస్తామన్నారు. ప్రభుత్వం పేదలు ఇళ్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు ఇస్తుంది. స్థలం లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని చెప్పుకొచ్చారు ఎంపీ కవిత. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అమలవుతున్నాయి…కేంద్రంలో కూడా మన అనుకూల ప్రభుత్వం ఉంటే తెలంగాణలో అభివృద్దిన కేసీఆర్ పరుగులు పెట్టిస్తారని చెప్పారు. కారు గుర్తుకు ఓటేసి ….మీరు గెలిపిస్తే మరో ఐదేళ్లు ప్రజల సేవలో తరిస్తామని కవిత చెప్పుకొచ్చారు.
ఐదేళ్లు మీకోసం ఎంతో చేశాను. మరోసారి నిజామాబాద్ ఎంపీగా దీవించి…గెలిపిస్తే మరింత సేవ చేస్తానని హామీ కవిత ఇచ్చారు. జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆమె… దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ గెలుపు ఎంత కీలకమో ప్రజలకు వివరించారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు వస్తే బతిమిలాడుకుని పనులు చేసుకోవాలి. మన సపోర్ట్ తో వచ్చే ప్రభుత్వం ఉంటే…తెలంగాణకు ఎంతో న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారామె.
దేశంలో ఇప్పటికే ఎన్నో మార్పులొచ్చాయని, ఐదేళ్ల క్రితం ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల తరుపున గళం వినిపించానన్నారు. ప్రజల సమస్యల మీద పోరాడానన్నారు. జాతీయ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశాను.. బీడీ కార్మికులు, సింగరేణి సమస్యలు నుంచి పసుపు బోర్డు, కాశ్మీర్ వరకు ఎన్నో వాటిపై మాట్లాడాను. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో కలిసి మన ఎంపీ మన ఊరు కార్యక్రమం ద్వారా సమస్యలు తెలుసుకున్నాను. కొన్నింటిని తీర్చాము.. మరికొన్ని తీర్చబోతున్నాం.. ఇంకా ఎలాంటి సమస్య ఉన్నా తాను స్వయంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కవిత.
రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కేంద్రంలో కూడా మనం కీలక పాత్రం పోషిస్తే.. తిరుగుండదు. మనవి 16 ఎంపీలు మాత్రమే అనుకోవద్దని…కాంగ్రెస్, బీజేపీలను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలు ఎన్నో ఉన్నాయి. వాటిని కలుపుకుని…కేసీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే పరిస్థితి రావాలన్నారు. నిజామాబాద్ ఎంపీగా పూర్తిగా న్యాయం చేశాను.. మరోసారి గెలిపిస్తే రెండు వందల శాతం కష్టపడి అందరి బాగోగులు చూసుకుంటానని కవిత అన్నారు.
మరోపక్క, కవిత ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. మాలమహానాడు, ఎమ్మార్పీఎస్ నేతలు కలిసి కవితకు మద్దతు తెలిపారు. ఎంపీగా కవితను ఆరు లక్షల మెజారిటీతో గెలిపిస్తామని ప్రతిన బూనారు. అభివృద్ది కేవలం తెలంగాణ తోనే సాధ్యమని ఇతర కుల సంఘాల నేతలు ప్రకటించారు. ఢిల్లీలోనూ గులాబీ జోరు ఉండాలన్న కవిత…మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి కవిత ధన్యవాదాలు తెలిపారు.