ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు భద్రతను మరింత కుదించారు. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులకు భద్రతను తొలగించిన సంగతి తెలిసిందే. జడ్ కేటగిరిలో ఉన్న మాజీ మంత్రి నారా లోకేశ్కు 2+2 గన్మెన్లు కేటాయిస్తూ వై ప్లస్కు కుదించారు.
చంద్రబాబు కుటుంబ సభ్యులైన భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాన్ష్లకు భద్రతను పూర్తిగా తొలగించారు. చంద్రబాబు వాహన శ్రేణిలో స్థానిక పోలీసులు ఇవ్వాల్సి ఉన్న ఎస్కార్ట్, పైలెట్ క్లియరెన్స్ వాహనాలను జగన్ సర్కారు తొలగించింది. ఇక ఇప్పుడు చంద్రబాబుకు ఉండే ఇద్దరు ప్రధాన భద్రతా అధికారులను తొలగించటంతో పాటు వీరికి అనుబంధంగా ఉండే ముగ్గురు ఆర్.ఐల నేతృత్వంలోని దాదాపు 15 మంది సిబ్బందిని పూర్తిగా తీసివేశారు.
2004 నుంచి 2014 వరకు పదేళ్లు ప్రతిపక్షంలో ఉండగా ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గురు ఆర్ఐ బృందాలతో చంద్రబాబుకు గత ప్రభుత్వాలు భద్రత కల్పిస్తూ వచ్చాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అందరినీ తొలగించి ఇద్దరేసి కానిస్టేబుళ్లు చొప్పున రెండు బృందాలుగా 2+2గా కేటాయించింది. దీనిపై సోషల్ మీడియాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మిగతా ప్రజాప్రతినిధుల అందరి విషయంలోనూ దుబరా ఖర్చును, ప్రజలకు ఆటంకం కలిగించే హార్భాటాలను కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు.