తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను సస్యశ్యామలం చేసే దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాల్లోని ప్రతి అంగుళానికీ గోదావరి నీళ్లు తీసుకెళ్లేలా పథకాలకు రూపకల్పన చేయాలని కేసీఆర్ మార్గదర్శనం చేశారు. ఇరు రాష్ట్రాలు సౌభాగ్యంగా వర్ధిల్లాలన్నదే తన అభిమతమని, ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రగతి భవన్లో నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సమయంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. నదీజలాల వివాదాలకు కేంద్ర ప్రభుత్వాలు, కోర్టులు, ట్రిబ్యునళ్లు పరిష్కారం చూపలేకపోతున్నాయని, పరస్పర చర్చల ద్వారానే వీటికి పరిష్కారం కనుగొనాల్సి ఉందన్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డితో తాను చర్చలు జరిపానని వెల్లడించారు.