ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జూలై 1వ తేదీ నుంచి ప్రజలతో డైలీ కలువబోతున్నారు. ప్రజాదర్బార్ పేరిట ఈ కార్యక్రమం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉంటుంది. సీఎం అయినదగ్గర్నుంచి జగన్ ప్రజలను కలుస్తున్నప్పటికీ దానికి ఒక క్రమ పద్దతి అంటూ లేదు. అందుకే ప్రజాదర్బార్ను తలపెట్టారు.
గతంలో ముఖ్యమంత్రులు కూడా ప్రజలతో రెగ్యులర్ గా టచ్లో ఉండటం పరిపాటే. జగన్ జూలై 1 నుంచి ప్రతిరోజూ ఒక గంట పాటు ప్రజల్ని నేరుగా కలుస్తారు. ఈ కార్యక్రమం తర్వాతే సీఎం తన రోజువారీ అధికారిక కార్యక్రమాలు, శాఖాపరమైన సమీక్షల్లో పాల్గొంటారని ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం జగన్ క్యాంపు కార్యాలయం ఆవరణలో ఓ వైపున ఆయన కోసం వచ్చే సందర్శకులు వేచి ఉండటానికి ఒక షెడ్డును ఏర్పాటు చేస్తున్నారు.
అక్కడ వేచి ఉండే వారికి మంచినీటి సదుపాయం, పెద్ద ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ప్రజాదర్బార్లో ప్రజల నుంచి వినతిపత్రాలు, నివేదనలను ముఖ్యమంత్రి స్వీకరిస్తారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు సీఎం కార్యాలయం(సీఎంవో) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.