యువతకు బలంగా ఉండే కోరిక ఇదొక్కటే. నచ్చిన బైక్ కొని రోడ్లపై రయ్య్ రయ్య్ మంటూ తిరిగడం. ఆర్థిక స్థోమత ఉన్నవారు నచ్చిన బైక్ తెచ్చుకుని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఆర్థిక స్థోమత లేని చాలా మంది యువకులు తమ కోరికను చంపుకుంటుంటారు. అయితే ఓ యువకుడు నచ్చిన బైక్ ను కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. ఆర్థికంగా బలంగా లేని ఆ తల్లిదండ్రులు తర్వాత కొనిస్తామని కొడుకుకు నచ్చచెబుతూ వాయిదాల పర్వాన్ని కొనసాగించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా అమ్రాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మాధవానిపల్లి గ్రామానికి చెందిన గాజుల వెంకటేష్(19) అచ్చంపేటలోని ఓపెన్ ఇంటర్ చదువుతున్నాడు. అయితే గత కొన్ని రోజుల నుంచి వెంకటేష్ కు కొత్త బైక్ కొనాలనే కోరిక కలిగింది. ఇదే విషయమై తల్లిదండ్రులకు పలుమార్లు చెప్పిచూశాడు. దీంతో పాటు బైక్ కొనివ్వాలని తల్లిదండ్రులతో గొడవకు కూడా దిగాడు. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగ లేకపోవడంతో కొన్ని రోజులు ఆగాక కొనిస్తామని తల్లిదండ్రులు నచ్చచెప్పారు. అయినా వినని వెంకటేష్.., తల్లిదండ్రులతో రోజూ గొడవకు దిగుతూనే ఉండేవాడు. ఎంత చెప్పిన తల్లిదండ్రులు బైక్ కొనివ్వకపోవడంతో ఆ యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. సోమవారం తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగిన అనంతరం ఆ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గమనించిన ఆ యువకుడి తల్లిదండ్రులు హుటాహటిన ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేక పోవడంతో వెంకటేష్ ప్రాణాలు విడిచాడు. చేతికందిన ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో ఆ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ తీరు ఎంత వరకు కరెక్ట్? వెంకటేష్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: హోటల్లో కూలిగా చేస్తూ జీవనం.. ఎవరూ లేని టైమ్ లో!