మాసాల్లో కార్తీకమాసం పరమ పవిత్రమైనది. ఈ నెలలో దీపారాధాన, ఉపవాసం, అభిషేకం, వన భోజనాలు ప్రత్యేక అంశాలు.
అయితే చాలామందికి కార్తీకమాసంలో ఎప్పుడు, ఎక్కడ స్నానం చేయాలనే విషయమై రకరకాల సందేహాలున్నాయి.
కార్తీక మాసంలో చన్నీటి స్నానం చేయడం వెనక శాస్త్రీయ కారణాలు చాలా ఉన్నాయి.
శరద్ ఋతువులో చివరి భాగంలో వచ్చే కార్తీకమాసంలో చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు.
వర్ష ఋతు ప్రభావం కనుమరుగై శీతాకాలానికి మధ్య సంధికాలంగా ఉండే సమయం ఇది.
ఈ కాలంలో మారిన, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శరీరాన్ని మలచుకోవడం కోసం పూర్వీకులు ఏర్పాటు చేసిందే కార్తీకస్నానం.
నదులు, సరస్సులు, పారే కాలువలు, జలపాతాలు, బావుల వద్ద స్నానం ఆచరిస్తే చాలా మంచిది.
ఇవన్నీ వీలు కాకపోతే ఇంట్లోనైనా సరే శాస్త్రం ప్రకారం స్నానం ఆచరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
అయితే ఎక్కడ స్నానం చేసినా సరే చల్లని నీరు మాత్రమే ఉపయోగించాలి.
వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఈ విషయంలో సడలింపు ఉంది.
మొదట మామూలుగా స్నానమాచరించి, తర్వాత పొడి వస్త్రం ధరించి సంకల్పం చెప్పుకొని రెండోసారి స్నానం ఆచరించాలి.
శ్లోకం రానివారు, చదవలేనివారు భగవన్నామ స్మరణతో స్నానమాచరించాలి.
తులారాశి గతే సూర్య గంగా త్రైలోక్యపావని సర్వత్రా ద్రవరూపేణ సాసంసారే భవేత్ తథా అని శ్లోకం చదవాలి.
ఈ ఏడాది నవంబరు 16న ఉదయం 6 గంటలలోపు, నవంబరు 17 నుంచి 27 వరకు ఉదయం 5:30 లోపు కార్తీకస్నానం చేసేయాలి.
నవంబరు 28 నంచి డిసెంబరు 3వ తేదీ వరకు ఉదయం 5 గంటలలోపు, డిసెంబరు 4,5,6,7 తేదీల్లో ఉదయం 4:45 లోపు స్నానమాచరించాలి.
కార్తీకమాస స్నానం వల్ల శివకేశవుల అనుగ్రహంతోపాటు మోక్షప్రాప్తి కూడా దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
ఈ టైంలో స్నానం చేయడం కుదరని వాళ్లు అంటే వృద్ధులు, అనారోగ్యం బారిన పడినవారు.. కనీసం శుద్ధపాడ్యమి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో 30 రోజులు స్నానమాచరిస్తే ఫలితం లభిస్తుంది.
ఉద్యోగం చేస్తూ బిజీగా ఉండేవారు.. కార్తీకమాసంలోని నాలుగు ఆదివారాలైనా సరే ఆయా రోజుల్లో పైన చెప్పిన టైంలో స్నానం చేయాలి.
అలా కార్తీకమాసం స్నానమాచరించిన తర్వాత దేవాలయ సందర్శన చేసినా 30 రోజులు స్నానం చేసి ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.