క్రెడిట్ కార్డ్ వాడే వారికి ఈ వార్త తీపికబురు లాంటిది. యూపీఐ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి చెల్లింపులు చేసే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. 

ముందుగా రూపే క్రెడిట్ కార్డ్ వాడే వారికి ఈ సేవలు అందబాటులోకి రానున్నాయి. ఎన్‌పీసీఐ తాజాగా బ్యాంకులతో సమావేశం అయ్యింది.

పలు బ్యాంకులు, క్రెడిట్ కార్డు జారీ సంస్థలు.. ఈ సేవలపై ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది.

ఈ సేవలు అందుబాటులోకి వస్తే.. యూపీఐ యాప్స్ ద్వారా క్రెడిట్ కార్డు నుంచి నేరుగా చెల్లింపులు చేయొచ్చు. అంటే మీరు ఏమైనా కొనుగోలు చేస్తే.

యూపీఐ యాప్ ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం లేదంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు చెల్లించొచ్చు. ఇప్పటికే.. ఈ విషయంపై ఎన్‌పీసీఐ బ్యాంకులతో సమావేశం అయినట్లు తెలుస్తోంది.

ఈ అంశానికి సంబంధించి ఎన్‌పీసీఐ మార్గదర్శకాలను రూపొందిస్తుందన్నది సమాచారం. తర్వాత వీటిని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి కోసం పంపునున్నారు.

ఆర్‌బీఐ అనుమతి లభించిన వెంటనే సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎస్‌బీఐ కార్డ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్స్, యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సేవలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పటివరకు యూపీఐ ఖాతాలకు కేవలం డెబిట్ కార్డులను మాత్రమే లింక్ చేసుకునే సౌకర్యం ఉన్న సంగతి తెలిసిందే. ఇవి నేరుగా సేవింగ్స్ అకౌంట్లతో లింక్ అయ్యి ఉంటాయి.

మన బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు ఉంటే.. యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ నిర్వహించొచ్చు. డబ్బులు లేకపోతే పేమెంట్ జరగదు.

అయితే.. క్రెడిట్ కార్డులను యూపీఐతో లింక్ చేస్తే అప్పుడు చాలా ఎక్కువ పేమెంట్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో క్రిడిట్ కార్డు వినియోగం కూడా ఎక్కువ కానుంది.

యూపీఐ యాప్స్‌తో క్రెడిట్ కార్డ్‌ అనుసంధానం

1.యూపీఐ పేమెంట్‌ యాప్‌ను ఓపెన్ చేసి ప్రొఫైల్ పిక్చర్ పైన క్లిక్ చేయాలి.

2.ఆ తర్వాత పేమెంట్ మెథడ్‌ను క్లిక్‌ చేస్తే యాప్‌లో బ్యాంకు అకౌంట్స్ జాబితా కనిపిస్తుంది

3. అక్కడ యాడ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు పై క్లిక్ చేయాలి.

4. తరువాత కార్డు నెంబర్, ఎక్స్‌పైరీ డేట్, సీవీవీ, కార్డ్ హోల్డర్ పేరు నమోదు చేసి, సేవ్‌ను క్లిక్ చేస్తే సరిపోతుంది.

5.మీ క్రెడిట్ కార్డు యూపీఐ కు లింక్ అయ్యాక పేమెంట్స్ చేయొచ్చు.

యూపీఐ పేమెంట్స్ కు క్రెడిట్ కార్డులను అనుమతించడం సరైన నిర్ణయమా?.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.